Saturday, September 18, 2010

ఆర్.వసుంధరాదేవి

ఆర్.వసుంధరాదేవి
స్వానుభవ సంపదా,అన్వేషణా తృష్ణా,అధ్యయన తత్పరతల నించీ వెలువడిన తాత్విక చింతనా పరిమళాలు,ఆమె కధలు... పాఠకుల మనసులకు సాంత్వన నిచ్చే మంచిగంధపు లేపనాలు. మనసు పోకడలు,కడలి తరగలలా, ఒకానొక ఆవేశంతో ఎగసిపడి ఎగసిపడి.ఆవేశపడి.ఆయాసపడి.అంతలోనే తమ ఆత్మను కనుక్కుని,శమించి ప్రశాంతపడి ,శాంతపడి”ఓ! అంతా చేసి ఇందుకేనా? అని నిర్మలంగా నవ్వుకోగలిగే స్థితిలోకి తీసుకుపోతాయి. తన అనుభవంలోనుంచీ రూపొందించుకున్న తాత్వికతను పాఠకులకు పంచడం ఎంత తార్కికంగా కళాత్మకంగా ఉంటుందో తెలియాలంటే ఆమె 1960 లలోనే వ్రాసిన “చెరువుదగ్గర” తో మొదలు పెట్టి “జాన్ పాల్ చేసిన బీరువా” “పెంజీకటికావల”, “బ్రిడ్జి కింద” ,”నీడలు” “అమల,”“అమ్మా ఇక సెలవు” వంటి కధలు చదివి ఆమె తాత్విక ధృక్పధాన్ని,సామాజిక విశ్లేషణనూ ,మనస్తత్వశాస్త్ర పరిజ్ఞానాన్నీ,తెలుసుకుని ఆమె మనకు వాగ్దానం చేసే జీవనోత్సాహాన్ని అందుకోవాలి ...ఆమె రాటకొండ వసుంధరాదేవి. ఈమె వివిధ సంకలనాలలో వ్రాసిన యాభై కధలనూ గుదిగుచ్చి 2004లో ఒకే సంకలనంగా వెలువరించిన తరువాత అన్నికధలూ ఇప్పటిపాఠకులకు అందుబాటులో కొచ్చాయి .ఇందులోనుంచీ పై చెప్పిన కధలు ఆమె శిల్ప నైపుణ్యానికీ సామాజిక తాత్విక ధృక్పధానికీ అద్దంపడతాయి.

ముందు చెరుదగ్గిరికి పోదాం.దాన్ని బుక్కరాయసముద్రం చెరువని అక్కడి వాళ్ళు అన్నప్పటికీ ,దేశమంతా అనంతపురం చెరువనే అంటారని కురువలింగప్ప అంటాడు.అనంతాకాశం కింద ఆ చెరువు దగ్గర కట్టిన గణేశుడి గుడీ,అక్కడీ హద్దులు లేని స్వేఛ్ఛ సుశీలమ్మకి చాలా ఇష్టం...సుశీలమ్మ సంప్రదాయ కుటుంబం చెక్కిన బొమ్మ.ఆ ఇంటి ఆడపిల్లలెలా వుండి మంచి అనిపించుకోవాలో తెలుసుకుంటూ తనని అలా మలచుకుంటూ పెరిగి ,వివాహమై ,భర్తతోడిదే జీవనం అనీ భార్యా భర్తలబంధం ఆత్మపరమాత్మల బంధం అనీ నమ్మిభర్త కి జలుబుచేసినా భయపడుతూ బతుక్కొస్తున్న ముఫై అయిదేళ్ళ స్త్రీ.అయితే ఆమెలో ఈ మధ్య ఒక అలజడి ప్రారంభమైంది .”.తన జీవితం తనది కానట్లూ,ఎవరి బలవంతం మీదో బ్రతుకుతున్నట్లు బాధ. జీవిత కాలంలో చాలా భాగం గడిచిపోయింది.ఇహ చచ్చిపోవడం తరువాయి.బతక్కుండానే చావు...నిజం జీవితాన్ని అనుభవించాలని ,నవ్వాలని ఏడ్వాలని,అందులో లీనమై పోవాలని ఆరాటపడుతూ దాన్ని అందుకోలేక విడిగా నిలిచిపోయి వ్యర్ధంగా నశించిపోతున్నట్లు భావన.కల్గుతుంది...తానేదో బలాత్కారానికి గురౌతున్నట్లు,ఎవరో తనని మోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది. గడచిన జీవితం ఎడారిలాగా ముందున్నది స్మశానం లాగా తోస్తున్నది” అంతే కాదు”వేల సంవత్సరాలనించీ వెలుగులు చిమ్ముతూ వస్తున్న భారతీయ జీవన విధానం నేడు ఉత్త మేడి పండు అయిందా!!అందులో లోపం ఏర్పడిందా?కడుపులో పుచ్చును దాచుకున్న మల్లెమొగ్గ ఈ మనసు అనిపిస్తున్నది.ఇరుకులో చిక్కుకున్నట్టి భావన బలపడుతున్నది. ఈ ముసుగులో నించీ వ్యవహరించడానికే గాని జీవించడానికి హక్కులేదేల?ఏ పనీ సద్య స్ఫూర్తి తో చెయ్యలేను” ఇదంతా కూడా జండర్ చట్రంలో ఇరుక్కుపోయిన సుశీలమ్మ వేదన.ఇటువంటి ఎడారి లోకి కురువలింగప్ప ఒక నౌకరుగా ప్రవేశించాడు.ఎనభై ఏళ్ళ పల్లెటూరి “అనాగరికుడు”.వృధాప్యం అతని శరీరానికే గానీ జీవితానికి కాదు.ఆ చుట్టుపట్ల అన్ని ప్రదేశాలగురించి అనర్గళంగా మాట్లాడతాడు.మనుషుల గురించి ,ప్రకృతి గురించి జంతువుల గురించి ,అక్కడి వేయిన్నొక్క దేవుళ్లగురించి ,జీవితం గురించి ..అట్లా పరవళ్లు తొక్కే ఉత్సాహంతో మాట్లాడతాడు.గలగల మని నవ్వుతాడు.ఆ వయస్సులో తనకు అక్కరకు రాని కొడుకు గురించికూడా కోపంతెచ్చుకోడు.పిల్లలేదో చేస్తారని ఆశించి వాళ్ళని పెంచం కదా?పెంచడమనే ధర్మంప్రకారం పెంచుతాం అని నిర్వికారంగా జీవన సత్యాలను చెప్తాడుఎవరో తయారు చేసి పెట్టిన విధంగాకాక తనకి తోచినవిధంగా ప్రవర్తించే స్వేఛ్చ కలవాడు. .తనూ తన జీవితం వేరైనట్లు లింగప్పా అతని జీవితం వేరుకావని అనుకుంటుంది సుశీలమ్మ.సుఖం దుఃఖం,జబ్బు చావు అన్నీ జీవితంలో భాగాలే లింగప్పకి..దేనికీ కలతపడడు..అతనిది అతిసామాన్య జీవితం.. అధమాధపు జీవితం.. కానీ అది చావు తాకని జీవితం .నిరంతరం ప్రవహించే జీవన వాహిని...ఒక సజీవ చైతన్యమూర్తి,ఈ కురువలింగప్ప.అతని మాటలు. చేష్టలు .అనుభవాలు, జీవితాన్ని జీవించడానికే గానీ,కృత్రిమపు నీతి చట్రాలలో బిగించుకోడానికి కాదనే అతనిధృక్పధం,సుశీలమ్మకు ఒక చల్లని కాలక్షేపం.ఏ చెరువుదగ్గర,గణేశుని ఆలయం దగ్గర ఆమె స్వేఛ్ఛనూ శాంతినీ పొందగలిగేదో అక్కడే జరిగిన ఒక దుర్ఘటన ఆమె జీవితంలో భూకంపం అయి ప్రాణాలు తీసింది..ఆ చెరువుదగ్గరే ,ఆమె భర్త సమక్షంలోనే ఆమె పై అత్యాచారం జరిగింది.శరీరంపై అసహ్యం పుట్టి బావిలో దూకి చనిపోవాలనుకుంది.కానీ తీసి రక్షించారు.ఆస్పత్రిలో చేర్చారు.ఆమెను చూడవచ్చిన అత్తవారి నోటినించిగానీ పుట్టింటి వారి నోటి నుంచిగానీ ఆమెను బ్రతికించేమాటేదీ రాలేదు.ఆమెను ఏకాంతంలో “సీతా”అని ప్రేమగా పిలుచుకునే భర్తముఖంలో ఆమెను బ్రతికించే భావమేదీ కనపడలేదు.తనే తప్పూ చెయ్యలేదని ఆమెకు తెలుసు.తనకు చచ్చిపోడానికి ఎండ్రిన్ తెచ్చిపెట్టమని లింగప్పనడిగింది..భగవంతుడిచ్చిన జీవితం జీవించడానికే గానీ అంతంచేసుకోడానికి కాదనీ ఇక్కడ ఉండలేకపోతే ఇంకొక చోట ఉండే ఏర్పాటు చేస్తాననీ అనునయిస్తాడు లింగప్ప.లింగప్పని తప్పించుకుని చెరువుదగ్గరకి వచ్చింది సుశీలమ్మ.అక్కడ అనంతమైన స్వేఛ్ఛ!!,తను నమ్మి తనను అర్పించుకున్న నాగరిక సమాజం, తను తప్పు చెయ్యలేదనే నిజాన్ని ఒప్పుకుని తనని అక్కున చేర్చుకోలేక,ఒక అనాగరిక లింగప్ప ఎదుట మరిగుజ్జై పోయింది..తనకి మలినం అంటలేదని భగవంతుడికి తెలుసు.ఆయనకి కరుణ తప్ప ఇంకేమీ లేదు.అనుకుంటే ఒక సత్య దర్శనం అయినట్లయింది.అట్లా చెరువు గట్టున నడిచి నడిచి కాలికి రాయితగిలి దొర్లిపడి మట్టిలో కలిసిపోయింది. 1960 లోనే జండర్ నియంత్రణని స్త్రీలు ఎంత ఆత్మహత్యా సదృశ్యంగా భావించేవారో పదునుగా చెప్పిన కధ ఇది. బాహ్య ప్రవర్తనలో నాగరిక సమాజానికి కాంట్రాస్టుగా కనిపించే లింగప్ప భగవంతునిలా ప్రాణదాతే కానీ నాగరిక సమాజంలా ప్రాణహరుడు కాదు. వసుంధరాదేవి సృష్టించిన గొప్ప పాత్ర కురువ లింగప్ప..

ఇంచుమించు ఇటువంటిదే జాన్ పాల్ పాత్రకూడా. ఇతను టక్కరి వాడు.భార్యను హింస పెట్టగా ఆమె అతన్ని విడిచిపెట్టి కూతురుతో వుంటోంది .అతని కొడుకు ఫిలిప్.కొడుకంటే కడు ఆపేక్ష అతనికి.అందువల్ల అతను సరిగ్గా కుదురుకోకపోయినా ఏమీ అనడు.పైగా కొడుక్కి ఆత్మాభిమానం ఎక్కువని గర్వంగా చెబుతాడు. ఈ కధ ఉత్తమ పురుషలో నడుస్తుంది. కధకురాలు ఎంతో అభిమానంగా దాచుకున్న పాట మీద ఆమె కొడుకు కొత్త పాట రికార్డు చేస్తాడు.తనకెంతో ఇష్టమైన పాట లేకుండా పోయినందుకు బాధపడి తనకంటూ ప్రత్యేకంగా ఒక బీరువా వుంటే తనకిష్టమైనవన్నీ దాచుకోవచ్చని ఆమె జాన్ పాల్ ని పిలిచి బీరువా చెయ్యమని పురమాయిస్తుంది.అతను దొంగ బిల్లులు వేయించి కలప కొంటాడని, చెక్కలు ఎత్తుకు పోతాడనీ వేళకి పని పూర్తి చెయ్యడనీ మధ్యలో మరోపని ఒప్పుకుంటాడనీ అతన్ని గురించి చాలా మంది చెబుతారు.అయినప్పటికీ అతను నైపుణ్యం కల పనివాడు కాబట్టి అతను పెట్టే తిప్పలన్నీ పడి మొదట చెప్పిన అంచనా కు చాలా ఎక్కువ ఖర్చైనా బీరువా చేయించుకుంటుంది .ఇంక చివరి పాలిష్ లు కొసముగింపులు వుండగా జాన్ పాల్ కొడుకు ఫిలిప్ వాగులో పడి చనిపోతాడు.అంత ప్రేమించిన కొడుకు మరణం అతన్ని ఎంత కుంగదీస్తుందో ననుకుంటుంది ఆమె...కానీ ఇప్పుడు అతనిలో అది వరకటి టక్కరి తనానికి అతివినయానికి బదులు ఒక హుందాతనం వచ్చింది. “..మాట పొరపాటు రాకూడదు నాయనా!!అయ్యగారు డబ్బులెక్కువని కోప్పడితే నువ్వు కూలి తీసుకోమాక” అని అతని కొడుకు చెప్పిన మాటకి కట్టుపడి తన పాత జీవన ధోరణిని మార్చుకున్నాడు. కొడుకు పోయిన నాలుగోరోజునే పనికి వచ్చాడు.బీరువా పని పూర్తి చేశాడు.మనిషిని ధరించిన మనస్సు అనంతమూ మహాశక్తివంతమూ అని కధకురాలు అర్ధంచేసుకుంటుంది..జాన్ పాల్ ధైర్యశాలి,బలశాలి.ధైర్యమూ బలమూ మనిషిలోని సత్యానికి సంబంధించిన గుణాలు..బీరువాను చూసిన పిల్లలు తామెవరు ఏ అరల్లో ఏం పెట్టుకోవాలో అని మాట్లాడుకున్నఫ్ఫడు ఆమె అది తనకోసం చేయించుకున్నానని అనదు జాన్ పాల్ కొడుక్కిచ్చిన మాటకోసం తనపాత జీవితాన్ని ఎంత అలవోకగా విడిచిపెట్టాడో తన తన వస్తువులు తనకే వుండాలన్న కోరికని వదులుకుని..తను దాన్ని ఉపయోగించుకున్నా లేకపోయినా ఫరవాలేదనుకుని పిల్లలకివ్వడానికి సిధ్ధపడుతుంది. :”ఈ ప్రపంచం ఒక అస్పష్టమైన వర్ణ చిత్రం.అందులో మనం గుర్తించగలిగేది అంతకు ముందే (మన) మనసులో ఎరుకగా వున్న దానిని మాత్రమే..అనికూడా అంటుంది రచయిత్రి...

నీతి,వినయం ఇతరుల బాగుకోసం తాము అన్నీ వదులుకోడం ,తమ బ్రతుకిక ఇంతే అనుకుంటూ అణిగి మణిగి వుండటం మొదలైన గుణాలన్నీ బొద్దింక గుణాలనీ ,జీవించడం అంటే ఒక ఉత్సాహంతో ధైర్యంతో జీవించడం అనీ టక్కరితనం అబధ్ధాలాడటం వంటి కొన్ని సర్వైవల్ టెక్నిక్న్స్ అవలబించినా అది జీవనోత్సాహానికి నిదర్శనమే కానీ మరొకటికాదనీ రచయిత్రి “మనుషులూ బొద్దంకులూ” “అ-బధ్ధం’ బ్రతుకు తెరువు” వంటికధల్లో చెబుతారు.
“పెంజీకటి కవ్వల”.కధలో ప్రధాన పాత్ర జయలక్ష్మి,ఆమె మానసికావస్థలు ,భయాలు,అనిశ్చితమైన ,ఆలోచనలు,ఆమె మానసిక పరిణామం ,పరిణతీ పొరలు పొరలు గా చిత్రించడం వసుంధరాదేవి ప్రత్యేకతే!! ప్రాణులందరికీ మరణం తధ్యమే.అయితే మనుషులకు ఆ ఎరుకను నిబ్బరంగా అంగీకరించడం అంత సులువుకాదు.సంపన్నుల కాలనీలో కావాలని ఇల్లుకట్టుకున్న జయలక్ష్మికి ఆ కాలనీ వెనక వుండి శవంకాలినప్పుడల్లా ఇళ్ళల్లోకి చావుకమురువాసన పంపే స్మశానం అంటే భయం ఏవగింపు.తనకి మరణం ఎప్పుడొస్తుందోనని భయం..ప్రతి సంఘటననూ చావుతో ముడిపెట్టి చూసుకుంటూ,”స్వామీ నన్ను బ్రతకనీ” అని దేవుడి గదిలో తలుపు వేసుకుని ప్రార్ధిస్తుంది. ఆమెకు గుండె జబ్బు వస్తుంది..అట్లా సంక్షుభితమైన మానసిక స్థితిలో వున్న జయలక్ష్మికి ఒక అనుభవం ఎదురైంది.ఈ ఆత్మికమైన అనుభవం తో ఆమెకు సత్య దర్శనం అయినట్లు అయింది.తను లేకపోయినా ఈ ప్రపంచం వుంటుంది.ఇక్కడి సౌందర్యం సంతోషం వుంటాయి. అనే ఆనందం కలిగింది,జయలక్ష్మి మానసికావస్థలను ఈ కధలో రచయిత్రి చిత్రించిన తీరు అధ్భుతం. అట్లాగే “నీడలు” అనే కధలో నిర్మల పాత్ర .,మనం చూసే చూపు బట్టే మనకు ప్రపంచం అర్ధం అవుతుందని,మనసులో వుండే నీడల్ని (అభద్రతాభావాలు,అహేతుక ద్వేషాలు ) తొలిగించుకుంటేగాని ప్రపంచాన్ని సరైన దృష్టితో చూడలేమనీ ఈ కధ చెప్తుంది.

“బ్రిడ్జికింద” కధ సమాజంలో వేళ్ళుపాతుకుపోయిన అవినీతి ,నిజాయితీ పరులకు బ్రతుకు దుర్భరం చెయ్యడాన్ని ముగ్గురు వ్యక్తుల జీవన నేపధ్యంలో ,చిత్రిస్తూ ,అటువంటి జీవితాన్ని వాళ్లు ఎదురుకున్న పధ్ధతుల్నీ దగాపడ్ద వాళ్ళ పక్షాన నిలబడవలసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.చలపతి తండ్రి కాలేజి లో స్వీపర్ గా పని చేసి అణగి మణిగి ఉంటూ పావలా అర్ధా మామూళ్ళూ టిప్పులూ వసూలు చేసుకుంటూ పార్టీల్లో మిగిలిపోయిన స్వీట్లూ ఫలహారాలూ ఇంటికి తెస్తూ తినీ తినకా జీవనం గడుపుకొస్తున్నాడు .ఆ పరిస్థితుల్లో స్కూల్ చదువు ముగించిన చలపతిని కూడా తండ్రి స్వీపర్ ఉద్యోగంలో ప్రవేశపెట్టగా ,అక్కడ తండ్రి హైన్యాన్ని చూసి ఆ ఉద్యోగమూ ఇల్లూ వదిలి రిక్షా తొక్కుతున్నాడు చలపతి. తండ్రి అప్పుచేసి తీర్చలేక ఆత్మ హత్య చేసుకుంటే రిక్షా తొక్కి ఆ అప్పు తీర్చి మళ్ళీ వ్యవసాయంలో నిలదొక్కు కుందామని పట్నం వచ్చాడు పోతప్ప.అతను నిజాయితీగానే వున్నాడు .అతనీ భార్య కూడా బ్రిడ్జి దగ్గర తమల పాకులమ్మి ఒకటీ అరా సంపాదిస్తున్నది.నీతి,నిజాయితీలమీద చలపతికీ పోతప్పకీ వాదమవుతుంది..పోతప్ప చెల్లెలు కూడా బ్రతకడానికి పట్నం వచ్చింది.బ్రిడ్జి కింద బజ్జీల దుకాణం పెట్టింది..ఆమె భర్త తాగుబోతు సోమరి.పోతప్ప రెండు పొటేలు పిల్లల్ని కొని మైదానంలో కట్టేస్తే ఒక దాన్ని రహస్యంగా అమ్మేసి తాగేశాడు.కోపంపట్టలేని పోతప్ప అతన్ని కొడుతుంటే పోలిసులు పట్టుకెళ్ళి లంచంఇస్తేగానీ వదలక పోతే అందుకోసం రెండో పొటేలుని అమ్మాల్సి వచ్చింది.ఆ కోపంతో నిస్సహాయతతో బాగా తాగేసిన పోతప్ప ఆర్ టీ వో గారి కారు షేడ్దు పీకి పడేసి భీభత్సం సృష్టిస్తాడు.మళ్ళీ పోలీసులు పట్టుకెళ్లడానికి వస్తే బ్రిడ్జికింద వాళ్ళ అతన్ని దాచేస్తారు. డబ్బుతో పాతు ఆత్మ విశ్వాసం కూడా పోయింది పోతప్పకి.అప్పుడతను చలపతి ఉంటే బావుండుననుకుంటాడు.చలపతి అప్పటికే కొన్ని అప్పులు తీర్చకుండానే వూరు వదిలి వెళ్ళిపోయివున్నాడు. సమాజం నిర్దేశించిన న్యాయాన్యాయాలకంటె మనుగడ ముఖ్యం అనేది చలపతి ఎంచుకున్న మధ్యే మార్గం .పాత ఊరినీ కొత్త ఊరినీ కలిపే ఆ రైలు బ్రిడ్జి కింద కానాలు ఎంతమందికో తాత్కాలిక నివాసాలు.”ఒక గుడ్ద పీలికల మూటా ఒక సంచీ రెండు కుండలూ, ఒక లోటా,నీళ్ళు ముంచుకున డబ్బా తెచ్చుకుంటారు.వాళ్ళు ఎంత ఆకస్మాతుగా వచ్చారో అంత ఆకస్మాత్తుగా నామరూపాలు లేకుండా మాయమై పోతారు. ఎందుకు వచ్చారో ఎలా బ్రతికారో ఎందుకు వెళ్ళిపోయారో ఎవరికీ తెలియదు.” అది బ్రిడ్జి కింద దయనీయ చిత్రం.భౌతిక పరిస్థులకు లొంగి ప్రవర్తించే ఏ పాత్ర పట్ల కూడా రచయిత్రికి విముఖతలేదు సానుభూతి తప్ప.వసుంధరాదేవి మరొక అధ్భుతమైన కధ “అమ్మా ఇక సెలవు”.ఈ కధలోని అమ్మ ఒక్క కధకురాలి అమ్మే కాదు ఆమె విశ్వమాత. ఈ కధలో రెండు అంశాలున్నాయి.ఒకటి ఆడపిల్ల జీవితాన్నంతా పెనవేసుకుపోయిన అమ్మ జీవితం రెండు వ్యాపారసంబంధమే కానీ మానవ సంబంధాన్ని హృదయ సంబంధాన్ని కోల్ఫోయిన కార్పొరేట్ వైద్యపు నిర్లక్ష్యపూరితమైన యాంత్రికత.జీవన్మరణ స్థితిలోని వ్యక్తికి రవంత ఊరట సాంత్వన ఇవ్వక మృత్యువుకూ వేదనకు మరింత చేరువ చేసే యాత్రికత....ఈ కధలో రచయిత్రి అమ్మగురించి వ్రాసిన ప్రతి వాక్యమూ ప్రతి ఆడపిల్ల మనసులో నిలిచిన సత్యం.వసుంధరాదేవి కధలలో పాఠకులమనసులో నిలిచివుండే కధల్లో ఒకటైన ఈ కధ గురించి రెండు వాక్యాల్లో రాయలేము.అట్లాగే చిట్టిరాజు,సీతాకోక చిలుక ,ఇంతేలే పేదల ఆశలు అడవిపువ్వు వాటికవి విశిష్టమైన కధలు.జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా నిరాశానిస్పృహలావరించినా మళ్ళి లేచి నిలబడి జీవితం కొనసాగించే రాగమ్మ, గౌరి, నాగరిత తెచ్చిన వేగానికి తట్టుకోలేక మరణించిన అమల ఇలా ఆయా పాత్రల మానసిక పరిణామాలను తనదైన శైలిలో నిబ్బరంగా చెప్తారు రచయిత్రి..

1931 లో జన్మించిన వసుంధరాదేవి బాల్యంలోనే వేటపాలెంలోని ప్రసిధ్ధ గ్రంధాలయంతో అనుబంధం ఏర్పరుచుకుంటూ తెలుగు భాషపై మక్కువ పెంచుకున్నారు.అటుపై గుంటూరులో సెంట్ జోసెఫ్స్ కాన్వెంట్ లోనూ అక్కడి విమెన్స్ కాలేజీలోనూ చదివి ఆంధ్రా యూనివర్సిటీ నించీ కెమిస్ట్రీ లో మాస్టర్స్ చేసారు. తరువాత ప్రఖ్యాత విమర్శకులు ఆర్,ఎస్.సుదర్శనం గారిని వివాహం చేసుకుని గృహిణిగా వుంటూనే తన అధ్యయనాన్నీ అన్వేషణనూ రచననూ కొనసాగించారు, ఇప్పుడు తన తెలుగు కధల్ని ఆంగ్లంలోకి అనువదిస్తున్నారు.మదనపల్లి నుంచీ న్యూయార్క్ లో స్థిరపడే ప్రయత్నంలొ వున్నారు.ఈ యాభై కధలే కాక “రెడ్దమ్మగుండు”అనే నవల వ్రాసారు.ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డ్,నూతలపాటి గంగాధరం అవార్డ్ లు అందుకున్నారు.

“తనకు తారసపడిన విశిష్టమైన అనుభవాన్ని చలం తన లేఖల్లో ,మ్యూజింగ్స్ లో పొందుపరచినట్లుగా, వసుంధరాదేవిగారు తన కధల్లో పొందుపరిచారనిపిస్తుంది.భగవంతునితో ప్రమేయం లేని తాత్విక విచారాన్ని ఈమె చాలా కధల్లో మనం గమనించగలం.ఈమె తాత్విక విచారణ ప్రపంచాన్ని వ్యతిరేకించేదికాదు ..అధిగమింపజూసేది...ప్రపంచానుభవాల్తో సంబంధంలేనిది..వాటిమీద ఆధారపడనిది..వాటన్నిటినీ సంతోషంగా తేలిగ్గా తీసుకోనిచ్చేది...దానికోసం ఈమె అన్వేషణ..” అంటారు బండి నారాయణ స్వామి.అవును కదా!!
(భూమిక నుంచి)

Tuesday, September 07, 2010

ఆచంట శారదాదేవి

ఆచంట శారదాదేవి
రవీంద్రనాధ్ టాగోర్,దేవులపల్లి కృష్ణశాస్త్రి ,చెహోవ్,కాథరీన్ మాన్స్ ఫీల్డ్ లను అభిమానించే ఆచంట శారదాదేవి కధలలో ఒక విషాదపు జీర అలముకుని వుంటుంది..ప్రకృతి ఆస్వాదన,సంగీతం పట్ల అభిరుచి ,ఎవరినీ నొప్పించని సున్నితత్వం ,ఉన్న పరిస్థితిల్లోనే ఏదో ఒక ఉపశాంతిని కనుక్కుని జీవితాన్ని నడుపు కోవడం,కొంత మానసిక విశ్లేషణ, ఈ మె రచనల్లో ముఖ్యాంశాలుగా వుంటాయి.స్త్రీల జీవితాలలో జెండర్ పాత్రని గుర్తింఛడంవున్నా, దాన్ని ఎదిరించలేని పాత్రలు... , ప్రేమా ఆరాధనలకు ప్రాముఖ్యం.లోకం పోకడ,కొన్ని తాత్వికమైన ఆలోచనలను,అనుభవాలను,,హాయిగా చదువుకుపోయే లలితమైన శైలిలో వ్రాస్తారు.
1950 ల మొదలుకుని విరివిగా వ్రాసిన ప్రసిధ్ధ కధా రచయిత్రులలో శారదాదేవి ఒకరు.”పగడాలు” “ఒక నాటి అతిథి” “అమ్మ ’ మరీచిక” ’ఆడవిదాగిన వెన్నెల” “పారిపోయిన చిలక” మారిన మనిషి “వంటి ప్రాచుర్యం పొందిన కధల తో కలిసి దాదాపు వంద కధలు వ్రాసి వుంటారు. ఆరు కధా సంపుటాలు వెలువరించారు.అన్నీ కలిపిన ఒక సమగ్రమైన సంకలం వెయ్యనందున ఇప్పుడు ఆ సంపుటాలలో కొన్నిమాత్రమే అందుబాటులో వున్నాయి. మొదటి కధ 1945 లో చిత్రాంగి అనే పత్రికలో వ్రాశారు I
ఆమె వ్రాసిన కథలన్నింటిలోకీ “పారిపోయిన చిలుక”అనేది అధ్భుతమైన కథ.అందులో శిల్పం తాత్వికత వర్ణన,వస్తువు జంత్రగాత్ర విద్వాంసుల స్వర సమ్మేళనంలా కలిసిపోయివుంటాయి .ఇది కామాక్షమ్మ కథ..,యువతులకుండే జీవనాకాంక్షలన్నిటి తో కళకళ లాడుతూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.సామాన్య కుటుంబంలో పుట్టిన కామాక్షమ్మ థర్డ్ పారం(ఎనిమిదో క్లాసు) వరకే చదువు కుంది . తన స్నేహితురాలిలా తనకు కూడా ఒంటినిండా నగలుంటే బావుండునను కుంటుంది .కుటుంబ పరిస్థితుల వల్ల ఆమెకు పదిహేనేళ్ళ వయసులో ముఫ్ఫై ఏళ్ళ సుందరావుతో పెళ్ళి కుదురుస్తున్నప్పుడు,”వంటీ నిండా నగలు పెడతారా?’అని తల్లినడిగింది.పల్లెలో.మామిటితోటా ఇల్లూ వాకిలీ నౌకర్లూ చాకర్లూ వున్న సుందరరావుకి భార్యగా ఆ ఇంట్లో అడుగు పెట్టిన కామాక్షమ్మ త్వరలోనే అతని వస్తు సముదాయంలో తనూ ఒకతెననీ అతనికీ తనకీ మధ్య ప్రేమ అటుంచి కనీసం భావప్రసారంకూడా లేదనీ,అంత ఇంట్లో తనకి మానవ స్పర్శ కరువైందనీ తెలుకుంది అతను రోజూ దగ్గరున్న బస్తీకి పొద్దున వెళ్ళి రాత్రికొస్తాడు.వచ్చాక కూడా ఆమెతో మాటా మంతీ లేదు.ఆమె పలకరించినా వెళ్ళి రేడియో వినమంటాడు...అతని వ్యాపకాలు అతనివి.కనీసం అతను రోజూ బస్తీకి వెళ్ళి చేసే వ్యాపారమేమిటో కూడా ఆమెకి తెలియదు ఆమెకి చెప్పవలసిన అవసరం అతనికి లేదు.అంత వంటరితనంతో వున్న కామాక్షమ్మకి ఒక నాడు గాయపడ్డ చిలుక దొరికింది.దాన్ని దగ్గరకు తీసి పంజరంలో పెట్టి చిన్నారి అని పేరుపెట్టుకుని చిన్నారి దాని పోషణలో దానికి మాటలు నేర్పడంలో ఆనందం వెతుక్కుంటుంది.కానీ ఒకనాడు పొరపాటున పంజరం తలుపు తీసిపెడితే చిలక పారిపోయింది. ఆమె దిగులు పడింది,మళ్ళీ వసంతం వచ్చి మామిడి చెట్లు పూతకి రాగానే చిలకలు తోటలోకి వస్తు న్నాయి..ఒకదాన్ని పట్తితెచ్చి పంజరం లో పెడతానంటే కామాక్షమ్మ వద్దంటుంది.వాటిని స్వేచ్చగా వచ్చి తోటలో తిరిగి పోనిమ్మని వాటిని చూడ్డంలోనే ఆనందం వుందనీ అంటుంది.పంజరంలో చిలుకకూ తనకూ పోలిక అర్థం అయినా అల్లా ఎగిరిపోవాలన్న కోరిక ఆమెకి లేదు..స్నేహరాహిత్యం ఆమెను బాధించిన విషయం కధనం అధ్భుతంగా వుంటుంది.
చాలా కధా సంకలనాలలో చేర్చబడి బహుళప్రాచుర్యం పొందిన కధ “పగడాలు”… కధ ..ఆడుకుంటూ పడేసుకున్న పగడాల దండ తీశాడన్న అభియోగంతో ఇంటి ఎదురుగా వుండే ముసలి లక్ష్మన్నతాత నూ అతని మనవరాలు సీతనూ అనుమానించి పోలీసుల్ని కూడా పిలుస్తారు.,వాసంతి తల్లితండ్రులు. ఆ దండ ఖరీదుకి డబ్బివ్వమంటారు.దండ ఖరీదు ఇవ్వలేని తాత తనదగ్గరున్న పదమూడు రూపాయలూ ఇచ్చి దణ్ణం పెడతాడు.కానీ చివరికి పగడాలు, బీరువా కింద దొరికాక కూడా ఆవిషయం అతనికి చెప్పి డబ్బు వాపస్ ఇవ్వకపోగా ఆ విషయాన్ని గుట్టుగా వుంచడం చిన్నారి వాసంతిని బాధపెట్టింది. పెద్దల పట్ల భయ భక్తులవల్ల ఆ విషయాన్ని అలాగే దిగమింగుకుంది. తరువాత వాసంతిని సీతతో ఆడ్డానికి పోనివ్వలేదు..వాళ్ళని దూరంనించే చూస్తూవుండేది..వివాహమై ఒక బిడ్డకు తల్లి అయినాక పుట్టింటి కొచ్చిన వాసంతికి ఆవిషయాలన్నీ గుర్తురావడంగా కధ మొదలౌతుంది .అప్పటి ఆటపాటలు ఆనాటి ఇంటి వాతావరణం.లక్ష్మన్న తాత మనవరాలు సీతతో తన ఆటలు.పోలీసు రిపోర్టూ తాత తనదగ్గరున్న డబ్బు అంతా ఇచ్చెయ్యడం అన్నీ గుర్తొస్తాయి.వాళ్ళేమయ్యారని తల్లిని అడుగుతుంది.ఆవిడ స్వభావం ప్రకారం అదంత ముఖ్య విషయంకాదన్నట్లు ముఖంచిట్లించుకుంటూ మాట్లాడుతుంది.ఆ పగడాలు ఇంకా వాసంతి మెడలోనే వున్నాయి.అవి గుండెల్లో కొట్టుకున్నాయి. గుండెల్లో గుచ్చుకునే ఆ పగడాలనీ ఆ చేదు జ్ఞాపకాలనీ ఆమె ఎందుకు మోస్తోందో తెలీదు.. చెప్పింది వినడమే పధ్ధతిగా పెరిగిన వాసంతి ,ఆ పగడాలని అలా గుచ్చుకున్నా వుంచుకోవాలనుకుని వుండ వచ్చు.పిల్లలలో చిగురించే స్పందనలను పెద్దల లౌక్యం కబళించడం సహజమే !! పెద్దదై బిడ్డ తల్లి అయిన వాసంతి ఆ పెంపకపు నీడనించీ బయటికి రాకపోవడం ఒక కారణం కావచ్చు.


ఎక్కువ కధల్లో యువతులు ఒక అపరిచితుడిపైనో చిన్నప్పటి స్నేహితుడి పైనో మక్కువ పెంచుకుని దాన్ని ఆరాధనగా మార్చుకుని ఆ అందని మానిపండుకోసం జీవితకాలం నిరీక్షిస్తూ వుంటారు ..వానజల్లు కధలో పార్వతి ఆమె బావను ప్రేమించింది.కానీ అతను అమెను ఇష్ట పడడు.ఆమె లెక్చెరర్ గా పని చేస్తూ తండ్రిని చూసుకుంటూ వుంటుంది..తన ఇల్లూ ఇంటి ముందరి చిన్ని తోటా తండ్రి ప్రేమా విధ్యార్ధుల అభిమానం,ఆమె జీవితానికి చోదక శక్తులు.చారుశీల అనేకధలో మంజిష్ట అనే అమ్మాయికి తన మేనమామ మరొకర్ని వివాహమాడాడని తెలుసు.అతను పెళ్ళిచేసుకున్న చారుశీలకి అతనంటే వల్లమాలిన అభిమానమేకాక ఒక పొసెసివ్ నెస్ ఉందని కూడా తెలుసు.తల్లి పోగానే ఆమె మేనమామ దగ్గరికే వచ్చింది.అయినా అతన్నే ఆరాధించింది.అతన్ని తప్ప వేరొకర్ని చేసుకోదు. చివరికి నదిలో పడి మరణించింది.అ మేనకోడలి మరణానికి కొంత చారు శీల పొసెసివ్ నెస్ కారణమన్నట్లు అర్ధమౌతుంది.అట్లాగే దిగుడుబావి అనే కధలో చంద్రమల్లి అనే అమ్మాయి ఆవూరిలో ఏదో పని వుండి వచ్చిన హరిరావుపైన మనసు పారేసుకుంది.తనపని కాగానే అతను వెళ్ళిపోతే ఆ వేదన భరించలేక చనిపోవాలని అనుకుని మళ్ళీ తన మరణం తన వాళ్ళనెంత కృంగతీస్తుందో గ్రహించుకుని ఆప్రయత్నం మానుకుంటుంది.కానీ అతన్నే తలుచుకుంటూ ఆ దిగుడుబావి దగ్గరకు వెళ్ళి కూచుంటూ వుంటుంది..నిలువలేని నీరు కధలో ధరణి తన బావను ప్రేమించింది.అతని నడత మంచిదికాదని చెప్పినా అతన్నే పెళ్ళిచేసుకుంటానని పట్టుపట్టింది.అతన్ని అమెరికా పంపించి పై చదువులు చెప్పిస్తానని ధరణి తండ్రి ఆమెతో పెళ్లికి వప్పిస్తాడు. అతను ధరణిని పెళ్ళిచేసుకుని అమెరికా వెళ్ళిపోయాడు.తిరిగి వచ్చినా ఆమెను పిలవడు.పైగా వేరొక అమ్మాయిని పెళ్ళి చేసుకోటానికి ఈమెను పెళ్ళి రద్దు చేసుకున్నట్లు వ్రాసిమ్మంటాడు.అతనడిగిందేచాలని వ్రాసిచ్చింది.అతని జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నది.కానీ చివరికి అతను ధరణిని రమ్మని కబురు పెట్టాడు.కబురంపిందేచాలని సంబర పడుతున్న ధరణికి ఆమె చెల్లెలు అతనెందుకు రమ్మన్నాడో చెప్పింది.అతని కొత్త భార్య గర్భంతొ వుండి పని చేసుకోలేక పోతున్నది కనుక ఆమెను రమ్మన్నాడు.అయినా అదే మహాభాగ్యమని ఆమె ఒప్పుకుంది..అప్పుడు వెన్నెలలో ఆమె ముఖం పసిపాపలా మెరిసింది,ఎంతైనా మనసులోపలి మమకారం మాసిపోదేమో అనుకుంది చెల్లెలు.మరీచిక అనే కధలో నీల కూడా తాముండే పరిసరాలను అధ్యయనం చెయ్యడానికొచ్చిన ఒకతన్ని ప్రేమించి అతను వెళ్ళిపోగానే దుఃఖసాగరంలో కూరుకు పోయింది.ఇక అందనిలేఖ కధలో సురస అనే అమ్మాయి తమ ఇంట్లో అద్దెకున్న ఒక అబ్బాయిని ఇష్టపడింది.అప్పటికి ఇద్దరికీ బాల్యమే.కలిసి ఆడుకునే వాళ్ళు.ఆ అబ్బాయి పేరు కిరణ మాలి.వాళ్ళనాన్న సంగీత విద్వాంసుడు. కొడుక్కి సంగీతం నేర్పుతూ వుంటే ఈ పాప శ్రధ్ధగా వింటూ అతని గానాన్ని మెచ్చుకుంటూ వుండేది.కిరణమాలి తల్లి చనిపోగా వాళ్ళు వూరు వదిలివెళ్ళిపోయారు. కానీ అతని వివరాలన్నీ ఆమె తెలుసుకుంటూనే వుంది.అతను ప్రసిధ్ధ గాయకుడయ్యాడు .డబ్బూ కీర్తి సంపాదించాడు.ఎంతగొప్ప గాయకుడయ్యాడో అంత స్త్రీలోలుడని పేరు పడ్డాడు.ఒక సంగీత విద్యాలయం స్థాపించాడు.అక్కడ శిక్షణ కొచ్చిన అమ్మాయిలకు అతనంటే గౌరవం వుండేది కాదు.అయినా అతని మీద ప్రేమతో అక్కడికి వెళ్లి సంగీతం నేర్చుకుని అతన్ని కలిసి వొచ్చిందే కానీ అతను తనని గుర్తుపట్టలేదు.ఊళ్ళో వాళ్ళకి తనని అతను పెళ్లి చేసుకుని బాధలు పెట్టాడనీ అందుకోసం వచ్చేశాననీ అబధ్ధం చెప్పి వాళ్ళ సానుభూతి పొందింది.ఇప్పుడామెకి తల్లీ తండ్రీ లేరు రాజీ అనే బంధువులమ్మాయి (మూగది ),ఒక నౌకరు మాత్రమే తోడున్నారు.అంతలోనే ఆమెకు కాలిమీద వ్రణం లేచి ప్రాణపాయం ఏర్పడింది..అప్పుడామె తన ఆస్తినంతా మూగ పిల్లకో పాలేరుకో వ్రాయకుండా అతని పేర వ్రాసేసి మృత్యువుకోసం ఎదురుచూస్తూ వుంటుంది.. ఒకసారి ఒకరిని ప్రేమించాక,జీవితమంతా అతనికోసమే అర్పించాలని అతని బలహీనతలన్నిటితో సహా అతన్ని స్వీకరించాలని,లేదా అతన్నే ఆరాధిస్తూ జీవితం గడిపెయ్యడమే గాఢమైన ప్రేమ అని రచయిత్రి భావన కావచ్చనిపిస్తుంది. ఇప్పటి పాఠకులు ఇటువంటి కధల్ని ఎట్లా తీసుకుంటారు?


.ఇవి కాక ఇతర అంశాలను స్పృశించిన కధల్లో చెప్పుకోదగ్గది,”కారుమబ్బులు”. ఒకే ఆఫీస్ లో పని చేసే యువతీయువకులిద్దరు పరిచయం పెరిగి ఇష్టపడి పెళ్ళిచేసుకుని కలిసి మెలిసి కాపురం చేసుకుంటూ వుండగా భార్యకి ప్రమోషన్ వచ్చింది.ఆమె తన కలీగ్స్ కు పార్టీ ఇస్తే అతను వెళ్ళడు.ఆ క్షణం నించీ అతని ప్రవర్తనలో మార్పొచ్చింది. అతను ఆత్మన్యూనతతో బాధ పడుతున్నాడని గ్రహిస్తుంది..అతను అక్కడ రాజీనామా చేసి వేరే ఉద్యోగం చేసుకుంటానంటే ఆమె రాజీనామా చేసి అతన్ని సంతోష పెడుతుంది.అతని మనసుకి పట్టిన మబ్బు విడిపోయింది కానీ ఆమె ఇప్పుడు అతనికి అంత సన్నిహితంగా మెలగలేకపోతుంది. తన ప్రమోషన్ ని సహించలేక పోయిన అతని సంకుచితత్వం గుర్తొస్తూ వుంటుంది.. ఆ మబ్బేదో తనని ఆవరిస్తున్న దని పిస్తుంది. కానీ తన ప్రవర్తనకు తనే నవ్వుకుని ఆందులోనించీ బయటికి రావాలనుకుంటుంది .ఉదాత్తంగా ప్రవర్తించడం స్త్రీలు అలవాటు చేసుకోవాలికదా! “అందం”అనే కధ లో మాలతి అందమైన స్త్రీ,పసితనం నించీ ఆమె అందం అందర్నీ ఆకర్షించేది.అది ఆమెనొక్కక్కసారి చాలా చికాకు పెట్టేది కూడా.చిన్నప్పుడు బుగ్గలు పుణకడం,కౌగిళ్లల్లో బంధించడం వంటివి.. రాను రాను ముసలి వాళ్ళు కూడా తినేసేలాగా చూడ్డం అబ్బాయిలు వెంటపడ్దం ఇవ్వన్నీ స్త్రీల సహజానుభవాలే .అట్లాగే తోటలో అందం గా పూసిన పూలను తెంచేదాకా కొంతమందికి తోచదు.చెట్టునుంటె కళ్ళకీ మనసుకీ ఆనందం కలిగించే పూలను తెంపి ఒక్కక్షణం ఆనందించి పడెయ్యడమూ అంతే సహజం. మాలతి అందం చూసి ముగ్ధుడైన జడ్జిగారబ్బాయి ఆమెను కోరి పెళ్లిచేసుకున్నాడు. అయితే ఆ అందాన్ని పక్కన పెట్టుకుని బయటకి వెళ్లినప్పుడల్లా అతనికి ఆమెను అందరూ అట్లా చూడ్డం నచ్చదు.పమిట కప్పుకోమని అలాంటివన్నీ అంటూ వుంటాడు.ఆమె అతనితో బయటకు పోవడం తగ్గించింది.ఇప్పుడిక మాలతి కూతురు చిన్నపాప మాలతిలాగే అందంగా వుంటుంది.ఎవరో హైస్కూల్ పిల్లాడు అ పిల్ల బుగ్గ గిల్లితే అక్కడ గిల్లిన గుర్తుపడింది.ముందు కోపం వచ్చింది మాలతికి.ఎవరైనా గిల్లితే మళ్ళీ గిల్లు,మాష్టర్ కి రిపోర్ట్ ఇవ్వు అని చెప్పాలనుకుంది “ అయినా ఎవర్నని ఏంలాభం ,మానవ ప్రకృతి మారదు.మౌనంగ భరించక తప్పదు’ అనుకుంటుంది..అట్లా చెబితే పాప లో సున్నితత్వం నశిస్తుందంటుంది .మొరటుదైపోతుంది అనుకుంటుంది.పాప తండ్రి పాప బుగ్గ చూసి కోపంత్తో మండిపడతాడు.హేడ్ మాష్టర్ కి చెప్తానంటాడు.మాలతి నవ్వుకుంటుంది.పువ్వులు కొయ్యకుండా వంటావిడ ఎవర్నీ ఆపలేదు తండ్రి కూడా పాప బుగ్గ గిల్లకుండా ఎవర్నీ అపలేడు, అరిచి నవ్వులపాలవడం తప్ప అనుకుంటుంది .ఇంకా అందంగా వుండడం పాప చేసిన తప్పు ,అందంగా వుండడం పువ్వులు చేసిన పాపం అనికూడా అనుకుంటుంది.మన ముంగిట్లో తోటపూలు మనం కాపాడుకోలేమనీ, మన పిల్ల బుగ్గ కమిలి పోయేలా గిల్లితే మనం ’అదంతే” అని ఊర్కోవాలని చెప్పిన ఈ కధని అర్ధం చేసుకోడం కష్టమే.. స్త్రీలపై వయసుతో నిమిత్తం లేకుండా చాలా సటిల్ గా జరిగే లైంగిక వేధింపుల్ని అండర్ టోన్స్ లో చక్కగా చెప్పిన ఈ కధ ముగింపు కొచ్చేసరికి అట్లా మిధ్యా వాదం లోకి మళ్ళింది.

.
వృధ్ధాప్యంలోని ఒంటరితనంలో ఒక స్నేహం కోసం ఆశపడి, జీవనోత్సాహం నశించిపోకుండా కాపాడు కోడం కోసం “బిందువు” కధలో రంగాజమ్మ దేవయ్యతో స్నేహం చేస్తుంది. .”అమ్మ” అనే కధలో ఒకమ్మాయి తనతల్లి అమిత తెలివైందీ చురుకైందీ అని అందరికీ చెప్పి నమ్మిస్తుంటుంది.నిజానికి ఆమెకు అసలు తల్లి లేదు.ఈ “డెల్యూ జన్” ఆ అమ్మాయికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది.దాన్ని ప్రశ్నించకుండా ఆమె నలా బ్రతకనివ్వడమే ఆమెకు చేయగల ఉపకారం అంటుంది రచయిత్రి.ఇట్లా మానసిక వైచిత్రులమీద శారదాదేవి మరికొన్ని కధలు కూడా వ్రాశారు. అడవి దాగిన వెన్నెల “ కధలో తపతి,సవతి తల్లి వలన అనేక బాధలు పడుతుంది.ఆమెని నిలువరించలేని తండ్రి తపతిని వేరే ఊరు రహస్యంగా తీసుకొచ్చి రామలక్ష్మి కొడుక్కిచ్చి పెళ్ళి చేసి వెళ్ళిపోతాడు. వితంతువైన .రామలక్ష్మి కూడా స్వతంత్రురాలు కాదు.ఆమె మనుగడ కోసం గోవిందయ్య చెప్పుచేతల్లో ఉంది.గోవిందయ్య కన్ను తపతిపై పడ్డం రామలక్ష్మిని కలత పెట్టింది.గోవిందయ్య కంటపడకుండా ఒక రాత్రి ఇంటివెనుక అడవిలో దాక్కున్న తపతి అక్కడే మరణించింది..మరొక కధలో మధ్య తరగతి జడత్వం ఉదాసీనతలు ఎన్ని నష్టాలకు వేదనలకు కారణమౌతాయో చక్కగా చెప్పారు.
మొత్తం మీద శారదాదేవి కధల్లో ఆవేశం వుండదు, ఆత్మ శోధన తోనో ఇతరుల బోధ తోనో అధ్యయనం అనుభవాల ద్వారానో చైతన్యం పొంది కార్యాచరణకు సిధ్ధపడే పాత్రలూ తక్కువే..ఉన్నస్థితిలోనే ఒక ఉపశాంతిని వెతుక్కుని దాన్ని రేషనలైజ్ చేసుకునే పాత్రలే ఎక్కువ కనపడతాయి .ఒక్క“చందమామ” అనే కధలో మాత్రం ప్రధాన పాత్ర భర్త వేధింపు మాటలు పడలేక బిడ్దను తీసుకుని పుట్టింటికొచ్చింది .వేధింపు మాటలు ఆపినాకే తిరిగొస్తానంటూ అందుకోసం ఎదురు చూస్తుంది. .. శారదాదేవి గారి కధల్లో తండ్రులందరూ చాల మంచివాళ్ళు..ఆడపిల్లల్ని ప్రేమగా అక్కున చేర్చుకునే వాళ్లు.
1922 లో జన్మించిన శారదా దేవి గారిది అసలు విజయవాడ. మద్రాస్ లోని విమెన్స్ క్రిష్టియన్ కాలెజీ లోనూ ప్రెసిడెన్సీ కాలేజీ లోనూ చదివారు.1954 నించీ 77 వరకూ తిరుపతి పద్మావతీ కళాశాలలో తెలుగు ప్రొఫెసర్ గా వున్నారు. ఆచంట జానకిరామ్ గారిని వివాహం చేసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.1999 లో మరణించారు
(భూమిక నుంచి)